Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    స్త్రీ శక్తి పథకం: ఏ కార్డులు చూపెట్టి ఉచిత ప్రయాణం చేయొచ్చు.. ఏయే బస్సుల్లో వర్తిస్తాయి? వివరాలు.

    1 month ago

    Andhra Pradesh Stree Shakti Scheme | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలు ఆధార్ సహా మూడు రకాల గుర్తింపు కార్డులను చూపించి, ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. ఉచిత ప్రయాణానికి అయ్యే డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు..

    అంశాలు

    • స్త్రీ శక్తి పథకం అంటే ఏమిటి?
    • స్త్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు?
    • స్త్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు:
    • ఏయే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు?
    • ఏయే బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదు?
    • స్త్రీ శక్తి పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):

    మహిళల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా అభివృద్ధికి దోహదం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మరో పథకం ‘స్త్రీ శక్తి’ (Stree Shakti Scheme). ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2025 ఆగష్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైంది.

    స్త్రీ శక్తి పథకం అంటే ఏమిటి?

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ‘స్త్రీ శక్తి’. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌‌లకు ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఆగస్టు 11న విడుదల చేసింది. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తున్నారు.

    స్త్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు?

    • ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయుండాలి.
    • బాలికలు/ మహిళలు అయుండాలి.
    • ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచిత ప్రయాణానికి అర్హులు.
    • నిర్దిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.

     

    స్త్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు:

    ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి అని తెలిపే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాలి. ఆర్టీసీ బస్సుల్లో ప్రధానంగా కింద పేర్కొన్న మూడు రకాల గుర్తింపు కార్డులను అంగీకరిస్తారు. అవి:

    1. ఆధార్ కార్డు
    2. ఓటర్ ఐడీ కార్డు
    3. రేషన్ కార్డు

    Free bus: ఏపీలో మహిళలకు అలర్ట్.. ఉచిత బస్సుకు ఆ కార్డు చెల్లదు.. తెలుసుకోకపోతే చిక్కులే..

    ఏయే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు?

    స్త్రీ శక్తి పథకం ద్వారా కింద పేర్కొన్న బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
    ✧ పల్లె వెలుగు
    ✧ అల్ట్రా పల్లె వెలుగు
    ✧ ఎక్స్‌ప్రెస్
    ✧ సిటీ ఆర్డినరీ
    ✧ మెట్రో ఎక్స్‌ప్రెస్

    APSRTC కి చెందిన దాదాపు 75% బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర స్థాయిలో 5 రకాల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1000 ఆదా అవుతుందని ఆయన చెప్పారు. అయితే, కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.

    ఏయే బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదు?

    • నాన్ స్టాప్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
    • ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. (జిల్లాల నుంచి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు లాంటి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు)
    • సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ సహా ఇతర ఏసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదు.
    • తిరుమల - తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
    • కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. (ఆర్టీసీ అద్దెకు తీసుకొని నడిపే ప్రైవేట్ వ్యక్తుల బస్సులు)
    • చార్టర్డ్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
    • ప్యాకేజీ టూర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.

     

    స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఆగస్టు 15న సాయంత్రం ప్రారంభించారు. విజయవాడలోని ఉండవల్లి గుహల దగ్గర నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. దారి పొడవునా మహిళలు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బస్సు వెళ్లే మార్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి.. డీజే, తీన్మార్‌ డ్యాన్స్‌లతో సందడి చేశారు.

     


    విజయవాడ సిటీ టెర్మినల్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందన్నారు. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని చెప్పారు. మహిళలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

    శ్రీశైలం వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదా..?

    శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బస్సుల్లో రద్దీ ఎక్కువైతే ఘాట్‌ రోడ్డులో నడపడం కష్టమవడమే కాకుండా, ప్రమాదకరం కూడా. భద్రతా కారణాల రీత్యా శ్రీశైలం ఘాటు రోడ్డులో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్గాల్లోనూ (ఉదా: సింహాచలం ఘాట్ రోడ్డు) మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నారు.

    జిల్లాల మధ్య ఉచిత ప్రయాణం ఉందా..?

    ఒక జిల్లాకు చెందిన వ్యక్తి (మహిళ) ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని, ఇతర జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతి ఉండదని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాల మధ్య ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందా? లేదా? అని చాలా మందిలో సందిగ్ధం ఉంది. అయితే, ప్రభుత్వం గానీ, ఏపీ ఆర్టీసీ గానీ.. ఇప్పటివరకూ అలాంటి నిబంధన గురించి ప్రస్తావించలేదు. జిల్లాల మధ్య ప్రయాణించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

     

    స్త్రీ శక్తి పథకం ప్రయోజనాలు:

    1. స్త్రీ శక్తి పథకం ద్వారా విద్య, ఉద్యోగం, ఇతర అవకాశాల కోసం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
    2. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది.
    3. పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుంది.
    4. ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా మహిళలు తమ పనులను సులుభంగా చేసుకోగలుగుతారు.
    5. మహిళా సాధికారతకు ఈ పథకం దోహదపడుతుంది.
    6. బాలికలు ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
    7. ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది, గౌరవం పెరుగుతుంది.

     

    స్త్రీ శక్తి పథకం అమలుకు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది?

    • స్త్రీ శక్తి పథకంతో బస్సుల్లో రద్దీ పెరగనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
    • బస్టాండ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చించేందుకు చర్యలు చేపట్టారు. అదనంగా కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరుస్తారు.
    • ఇతర రాష్ట్రాల్లో అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
    • బస్సులన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
    • మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్‌ కెమెరాలు (Body worn camera) ఏర్పాటు చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది.

    ఏపీలో ఉచిత బస్సు పథకం .. మహిళలూ ఈ విషయాలను గుర్తుపెట్టుకోకుంటే ఇబ్బందే!

    స్త్రీ శక్తి పథకం అమలు ఇలా..

    స్త్రీ శక్తి పథకం అమలు కోసం ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. టిమ్స్ మెషిన్ల ద్వారా జీరో టికెట్స్ కొట్టడం పైనా శిక్షణ ఇచ్చారు. లబ్ధిదారులకు కండక్టర్ ‘జీరో-ఫేర్ టికెట్’ జారీ ఇస్తారు. అయితే, ఆ ప్రయాణానికి సంబంధించిన డబ్బులను ఆర్టీసీకి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీ వరకు ప్రయాణించారనే వివరాలను కండక్టర్ పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను బట్టి ఏపీఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు తిరిగి ఇవ్వడానికి వీలవుతుంది.

    జీరో-ఫేర్ టికెట్ల జారీని నిర్వహించడానికి టిమ్స్ మెషిన్ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఇతర రాష్ట్రాల్లో అనుభవాల రీత్యా ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

    ఉచిత బస్సు పథకం కోసం సంవత్సరానికి సుమారు రూ.1,942 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మొత్తం డబ్బును APSRTCకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. తొలి దశలో 750 బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

    గమనిక: ఎలక్ట్రికల్ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పించాలా, లేదా అనే అంశం క్యాబినెట్ పరిశీలనలో ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

     

    ఆటో డ్రైవర్లకు సాయం:

    స్త్రీ శక్తి పథకం రాకతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండిపడే ముప్పు ఉంది. ఆటోడ్రైవర్లకు ఏవిధంగా సాయం చేయాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆటో డ్రైవర్ సంఘాలతో చర్చించాలని మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తమకు నెలకు రూ.25,000ల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, తాము కూడా ఆటోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.

    స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఎలా ఫిర్యాదు చేయవచ్చు?

    స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ పథకానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రకటించలేదు. త్వరలో వీటిని తెలియజేసే అవకాశం ఉంది. స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.

    స్త్రీ శక్తి పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):



    1. స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాల మధ్య ప్రయాణించవచ్చా?
      స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. జిల్లాల మధ్య ప్రయాణించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ పథకం ద్వారా 5 రకాల బస్సుల్లో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
    2. జీరో టికెట్ కాబట్టి ఎక్కడైనా దిగిపోవచ్చా?
      మహిళలకు టికెట్ రుసుం లేదు కాబట్టి (జీరో టికెట్) ఎక్కడైనా బస్సు దిగిపోవచ్చని భావిస్తారు. అయితే, ఒక స్టేజీ వరకు ప్రయాణిస్తామని చెప్పి, ఆ స్టేజీ దాటిన తర్వాత దిగితే.. అది ఆర్టీసీకి నష్టం కలిగిస్తుంది. చెకింగ్ అధికారులకు పట్టుబడితే.. సదరు ప్రయాణికురాలికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కండక్టర్ ఉద్యోగానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే, మహిళలకు ఉచిత ప్రయాణమే అయినప్పటికీ.. నిజానికి జీరో టికెట్‌‌కు అయ్యే మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీ వరకు ప్రయాణం చేశారనే వివరాలు పక్కాగా ఉండాలి.
    3. ఉచిత బస్సు పథకానికి ఏయే గుర్తింపు కార్డులు వర్తిస్తాయి?
      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించడానికి స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు)లలో ఏ ఒక్క గుర్తింపు కార్డునైనా కండక్టర్‌కు చూపించి ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలు, బాలికలు, ట్రాన్సె‌జెండర్లకు ఈ అవకాశం కల్పించారు.
    Click here to Read More
    Previous Article
    ఉచితంగా LPG కనెక్షన్, రూ.550కే గ్యాస్ సిలిండర్.. ఉజ్వల పథకం వివరాలు
    Next Article
    Komatireddy: హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

    Related ప్రభుత్వ పథకాలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment